బాల పాఠము – రామానుజులు – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళవందార్ల శిష్యులు – భాగము 2

పిల్లలందరు బామ్మగారి ఇంటికి వెళ్ళారు.

నాన్నమ్మ: పిల్లలూ! అందరూ మీ చేతులు కాళ్ళు కడుక్కోండి. ఇక్కడ గుడిలో తిరువాడిప్పూరం ఉత్సవం జరిగింది, ఈ ప్రసాదం తీసుకోండి. ఈవేళ, మనం ఆండాల్ పిరాట్టికి ప్రియమైన వారి గురించి చెప్పుకుందాం. ఆండాళ్ పిరాట్టి వీరిని తన సొంత సోదరుడిగా భావించేది. ఎవరో తెలుసా?

వ్యాస: లేదు నాన్నమ్మా, ఆండాళ్ పిరాట్టి సోదరుడు ఎవరు నాన్నమ్మా? ఆండాళ్ కు సోదరుడు కూడా ఉన్నాడా?

బామ్మగారు: అవును, పుట్టుకతో సోదరుడు కాదు కాని, ప్రేమ అనురాగాలతో ఆమెకు వీరు సోదరుడైనాడు. వీరిని గోదాగ్రజ,  కోయిల్ అణ్ణన్ అని పిలిచేవారు. వీరు ఎవరో కాదు మన రామానుజులే! సంస్కృతంలో అగ్రజ అంటే అన్నయ్య అని అర్థం. ఆండాళ్ వీరిని తన అన్నగా భావించింది కాబట్టి వీరు గోదాగ్రజ అని పిలువబడ్డారు. ఇళైయాళ్వార్లు శ్రీపెరంబుదూర్లో కాంతిమతి కేశవ దీక్షితులకు జన్మించారు. వీరు స్వయంగా ఆదిశేషుని అవతారము. వీరు తిరువల్లిక్కేని పార్థసారథి పెరుమాళ్ళ అనుగ్రహంతో జన్మించారు.

ఉభయ నాచియార్లతో పార్థసారథి, ఉడైయవర్లు – తిరువల్లిక్కేని

పరాశర: నాన్నమ్మా! ఆండాళ్, రామానుజులకన్నా చాలా ముందు జన్మించింది కదా? అప్పుడు వారెలా అన్నయ్య అవుతారు?

బామ్మగారు: మంచి ప్రశ్న అడిగావు పరాశర. ముందు నేను చెప్పినట్లు, వీరు పుట్టుకతో కాదు కానీ ఆచరణతో సోదరుడైనాడు. గోదాదేవి, పెరుమాళ్ళపైన  ప్రేమతో 100 గంగాళాల పాయసాన్ని, 100 గంగాళాల వెన్నను తిరుమాలిరుంజోలై అళగర్ పెరుమాళ్ళకు నివేదన చేస్తానని సంకల్పించింది. కానీ, ఆమె చిన్నపిల్ల అయినందున, సాధ్యం కాలేదు. రామానుజులు నాచ్చియార్ తిరుమొళి పాశురాన్ని సేవించి, గోదాదేవి కోరికను గ్రహించి, ఈ నైవేద్యాలను తాను స్వయంగా సమర్పించాలని అనుకుంటారు. ఆండాలమ్మ తరపున 100 గంగాళాల పాయసాన్ని, 100 గంగాళాల వెన్నను తిరుమాలిరుంచోలై అళగర్ పెరుమాళుకు రామానుజులు నివేదిస్తారు. నివేదన పూర్తిచేసుకొని శ్రీవిల్లిపుత్తూరుకి చేరుకున్నప్పుడు, రామానుజులను ఆండాళమ్మ స్వాగతించి, వారిని కోయిల్ (శ్రీరంగం) నుండి వచ్చిన అన్నయ్యా (అణ్ణన్) అని పిలుస్తుంది. ఆ కారణంగా వీరికి కోయిల్ అణ్ణన్ అనే పేరు వచ్చింది. ఎప్పుడూ తన సోదరి కోరికలను నెరవేరుస్తారు కాబట్టి వీరిని ఆమె అన్నా అని పిలిచింది.

అత్తుళాయ్! కొన్ని తిరుప్పావై పాశురాలను వినిపించగలవా? మీ బడి పోటీలో నువ్వు ఆండాళ్ వేషం వేసుకొని పాశురాలు పాడావని నాకు గుర్తుంది.

బామ్మగారు: ఈ రోజు ఎందుకు వినిపించమంటున్నానో తెలుసా? ఎందుకంటే, రామానుజులను తిరుప్పావై జీయర్ అని కూడా పిలుస్తారు. గొప్ప విద్వాంసులైన రామానుజుల మనస్సుకి తిరుప్పావై దగ్గరగా ఉండేది, వీరు ప్రతిరోజు తిరుప్పావై సేవించేవారు వారు. ఎందుకో మీకు తెలుసా?

వేదవల్లి: తిరుప్పావైని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. నాకు అన్ని 30 పాసురాలు కంఠస్థంగా వచ్చు!

బామ్మగారు (చిరునవ్వుతో): మంచిది వేదవల్లి. తిరుప్పావై నేర్చుకోవడం సులభమే కాదు, ఆ ముప్పై పాశురాలలో మన సాంప్రదాయ సారమంతా ఇమిడి ఉంది. వేదానికి సమానంగా భావిస్తారు పెద్దలు. అందుకే తిరుప్పావైని “వేదం అనైత్తుక్కుం విత్తాగుం” అని పిలుస్తారు – ఈ ముప్పై పాశురాలలో మొత్తం 4 వేదాల నిగూఢ సారంమంతా ఇమిడి ఉంది.

అత్తుళాయ్: నాన్నమ్మా, రామానుజులకు చాలా పేర్లు ఉన్నట్లున్నాయి. మొదట, మీరు ఇళైయాళ్వార్ అని అన్నారు, ఇప్పుడు కోయిల్ అణ్ణన్, తిరుప్పావై జీయర్ అని అంటున్నారు!

బామ్మగారు: అవును. వీరికి ఆ పేర్లన్నీ వారి ఆచార్యులు, ఆండాళ్, పెరుమాళ్ళు ప్రేమతో ప్రసాదించారు. ఇప్పటి వరకు మీరు రామానుజుల ఆచార్యులను, రామానుజుల జీవితంలో ఆ ఆచార్యులు ఎలా సహకరించారో చూశారు. ఇప్పుడు రామానుజుల అనేక పేర్లను, ఆ పేర్లన్నీ వారికి ఎవరు ఇచ్చారో కూడా చూద్దాము.

  • ‘ఇళైయాళ్వార్’ అని తిరుమలై నంబి (రామానుజులకు స్వయానా మేనమామ) పెట్టిన పేరు.
  • మధురాంతగంలో పంచ సంస్కార సమయంలో పెరియ నంబులు ‘శ్రీరామానుజ’ అనే నామాన్ని ఇచ్చారు.
  • రామానుజులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించే సమయంలో దేవ పెరుమాళ్ళు వీరికి యతిరాజ, రామానుజ ముని అనే నామాలను ఇచ్చారు.
  • రెండు విభూతులు రామానుజుల ఆధీనములో ఉన్నట్టు ‘ఉడయవర్’ అని స్వయంగా నంపెరుమాళ్ళు పిలిచారు.
  • ‘లక్ష్మణముని’ అన్న పేరు తిరువరంగ పెరుమాళ్ అరయర్ ప్రసాదించారు.
  • తిరుక్కోష్టియూర్లో ఉన్న వారందరి చేత శరణాగతి చేయించినందుకు తిరుక్కోష్టియూర్ నంబి చేత ఎమ్బెరుమానార్ అని పేరు ఇవ్వబడింది. తిరుక్కోష్టియూర్ నంబి రామానుజుల కరుణా భావానికి ఎంతో ఆకర్షితుడై, వీరు ఎంబెరుమాన్ (పెరుమాళ్ళు) కంటే దయామయులు, అందుకే ‘ఎంబెరుమానార్’ అనే పేరుతో పిలిచారు.
  • ‘శఠకోపన్ పొన్నడి’ అని తిరుమలై ఆండాన్ ఇచ్చారు.
  • ఆండాళ్ చేత ‘కోయిల్ అణ్ణన్’ అని పిలువబడ్డారు.
  • ‘శ్రీ భాష్యకారర్’ అని కాష్మీర్లో సరస్వతి దేవి ఇచ్చిన పేరు.
  • ‘భూతపురీశర్’ అని శ్రీపెరుంబుదూర్లోని ఆదికేశవ పెరుమాళ్ళు ఇచ్చారు.
  • ‘దేశికేంద్ర’ అని మన తిరుమల శ్రీవేంకటేశ్వరుడు ప్రసాదించిన పేరు.

మొత్తం మీద రామానుజులకు అనేక ఆచార్యుల సంబంధం ఉండేది. వారందరూ రామానుజులను జాగ్రత్తగా చూసుకుంటూ, జ్ఞానబోధ చేస్తూ, ఆళవందార్ల తరువాత మన సాంప్రదాయం ముందుకు సాగే విధంగా జాగ్రత్తపడ్డారు. ఆళవందార్ల ఆశీర్వాదాలతో వీరు మొట్టమొదట తిరుక్కచ్చి నంబి ద్వారా శ్రీవైష్ణవంలోకి ప్రవేశిస్తారు. పంచ సంస్కారము పెరియ నంబి చేత తీసుకొని, తిరుమలై ఆండాన్ ద్వారా తిరువాయ్మొళిని నేర్చుకున్నారు, తిరువరంగ పెరుమాళ్ అరైయర్ నుండి మన సాంప్రదాయం సారాన్ని నేర్చుకొని, చరమశ్లోక సారాన్ని తిరుక్కోష్టియూర్ నంబి నుండి నేర్చుకొని, చివరకు తన మేనమామ పెరియ తిరుమలై నంబి ద్వారా శ్రీరామాయణం అర్థాలను తెలుసుకున్నారు. అలా, ఆళవందార్ల ఆరుగురు శిష్యులు తమ ఆచార్య భక్తిని నిరూపించుకున్నారు.

రామానుజులు – శ్రీ పెరుంబుదూరు

వేదవల్లి: నాన్నమ్మా, ఆవందార్ల గురించి చెప్పేటప్పుడు, రామానుజులు వారి శిష్యులు కాలేదు కానీ వారి కోరికలను నెరవేరుస్తానని ప్రమాణం చేశారని చెప్పారు. అవి ఏమిటి నాన్నమ్మా? ఆవందార్ల మనసులోని మాట రామానుజులు ఎలా తెలుసుకున్నారు?

బామ్మగారు: చాలా మంచి ప్రశ్న. ఆవందార్లు రామానుజులను శ్రీరంగానికి తీసుకురమ్మని పెరియ నంబులను పంపుతారు. వెంటనే పెరియ నంబి వారు కాంచిపురానికి బయలుదేరుతారు. పెరియ నంబులు రామానుజులను శ్రీరంగానికి తీసుకువచ్చే సమయానికి , ఆవందార్లు ఈ ప్రపంచాన్ని విడిచి పరమపదం చేరుకుంటారు. ఈ సంగతి వీళ్ళు శ్రీరంగానికి చేరుకున్న తరువాత తెలుసుకుంటారు. రామానుజులు ఆలవందార్ల తిరుమేని దర్శనం చేసుకున్నపుడు, వారి ఒక చేతి మూడు వేళ్లు ముడుచుకొని ఉండటం గమనిస్తారు. ఆవందార్ల శిష్యులను అడిగినప్పుడు, ఆవందార్లకు కొన్ని నెరవేరని కోరికలు ఉన్నాయని చెప్తారు. రామానుజులు వెంటనే ప్రమాణం చేస్తారు:

  • వ్యాస, పరాశార ఋషుల పట్ల వారి కృతజ్ఞతలను నిరూపించుట.
  • వారి జీవిత కాలంలో నమ్మాళ్వార్ల పట్ల ప్రేమ కృతజ్ఞతలను చూపించుట.
  • బ్రహ్మ సూత్రాలపైన భాష్యం వ్రాయుట, తరువాత కాలంలో అది శ్రీభాష్యంగా పిలువబడింది. కూరత్తాళ్వాన్ల సహాయంతో రామానుజులు వ్రాసినది. ఈ మహాకార్యాన్ని నిర్వహించేందుకు కూరత్తాళ్వాన్ తీ కలిసి రామానుజులు స్వయంగా కాష్మీరుకి ప్రయాణం చేస్తారు.

రామానుజుల చేత ఈ 3 ప్రమాణాలు తీసుకోగానే ఆవందార్ల మూడు వేళ్ళు తెరుచుకుంటాయి. ఈ సంఘటనను చూచిన అందరు శిష్యులు ఆశ్చర్యపడి రామానుజులను పొగడ్తలతో నింపి, మన సాంప్రదాయానికి తరువాతి ఆచార్యులుగా కీర్తిస్తారు. కాని, ఎంబెరుమానార్లు ఆవందార్ల పరమద దుఃఖంతో  శ్రీరంగనాథుని సేవించకుండానే కాంచిపురానికి వెళ్ళిపోతారు.

వ్యాస: కానీ నాన్నమ్మా, రామానుజుల ప్రతిజ్ఞతో ఆవందార్ల వేళ్లు ఎలా విప్పుకున్నాయి?

బామ్మగారు: రామానుజులు ఆవందార్ల మధ్య సంబంధం ఇంద్రియాలకు అతీతమైనది. వారిద్దరిదీ ఆత్మ సంబంధం. ఆవందార్లు తన 3 కోరికలు ఏమిటో  చెప్పారా? లేదు. అయినప్పటికీ, ఆవందార్ల సంకల్పం ప్రకారం రామానుజులు ప్రమాణం చేశారు. ఇది ఎలా జరగినట్టు? వ్యాస, ఇటువంటి సంబంధాలు ఇంకా ఉన్నాయి. ఎలాగైతే రామానుజుల మనస్సులో మెదులుతున్న సందేహాలను వారు అడగకుండానే దేవపెరుమాళ్ళు రామానుజులకు స్పష్టం చేశారో, అలాగే ఇది కూడా. ఇలాంటి సంబంధాలు ఆత్మసంబంధాలు, శరీరానికి సంబంధించినవి కావు. ఆవందార్లు రామానుజుల మధ్య సంబంధం కూడా అటువంటిదే.

ఇంత వరకు రామానుజుల అనేక ఆచార్యుల గురించి ప్రతి విషయం చూశాము. రేపు రామానుజులు ఎలా మహా నాయకుడైననారో, ఎలా ఈ ప్రయాణంలో వారికి అనేక మంది శిష్యులయ్యారో చెబుతాను.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-ramanujar-1/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment